ఆస్తమా, ఛాతీ నొప్పితో మనస్తాపం.. ఇంట్లో ఉరివేసుకున్న హేమంత్ (అజయ్)
18 రోజుల క్రితమే బాబు జననం.. అంతలోనే తండ్రి మృతి
మనప్రగతి న్యూస్ / వేములవాడ ప్రతినిధి:
రాజన్నా సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయినగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.పట్టణ సీఐ వీర ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాయినగర్కు చెందిన బాలసాని హేమంత్ (అజయ్) (24) గత నాలుగేళ్లుగా ఆస్తమా, తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడు. అనారోగ్య సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన అతడు బుధవారం తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిసింది.మృతుడికి 18 రోజుల క్రితమే బాబు జన్మించడంతో కుటుంబంలో ఆనందం నెలకొనగా, ఇంతలోనే హేమంత్ మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.మృతుడి తండ్రి బాలసాని మల్లేశం గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా పట్టణ సీఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలు లేదా మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా వైద్య నిపుణులను సంప్రదించి సకాలంలో సహాయం పొందాలని సూచించారు.

