మన ప్రగతి న్యూస్/
మహబూబాబాద్ బ్యూరో
నేడు జరిగే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ కక్షిదారులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్ని కేసులను సాధారణ పద్దతిలో పరిష్కరించడం సాధ్యంకాదని, అందుకనే మన చేతిలో ఉన్న అత్యున్నతమైనటువంటి ఆయుధమైన లోక్ అదాలత్ ను వినియోగించుకుని రాజీపడ గలిగే క్రిమినల్, సివిల్ భూ తగాదా, మోటార్ వాహన ప్రమాదం, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎక్సైజ్, విద్యుత్ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సెక్రటరీ అయిన సురేష్ మాట్లాడుతూ పెద్ద మొత్తంలో కేసులను రాజీపరుచుకుని కలిసిమెలిసి జీవించాలని అదేవిదంగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు.
