ప్రజా సమస్యలపై కవిత విమర్శలు
మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి:
ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన జనంబాట కార్యక్రమం గురువారం కాప్రా సర్కిల్లో సందడిగా సాగింది. ఈసీఐఎల్ చౌరస్తా నుంచి సైనిక్పురి వరకు యువ నాయకుడు గోగికర్ నవీన్కుమార్ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా, ర్యాలీకి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జనంబాటలో భాగంగా కవిత ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కవిత పలు అంశాలపై స్పందించారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే వాటిని పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. మహా కుంభమేళా, శ్రీకృష్ణాష్టమి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడంలో ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన రెండులక్షల పరిహారం ఇప్పటికీ బాధితులకు అందకపోవడం దురదృష్టకరమని, ఎంపీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయారని కవిత పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీలు కూడా అమలు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రభుత్వం అందించే పథకాలు బలహీనంగా అమలవుతున్నాయని, అనేక లబ్ధిదారులు సరైన ప్రయోజనాలు పొందలేకపోతున్నారని కవిత అన్నారు. ప్రజలకు చేరాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. జనంబాటలో మహిళలు, యువత, స్థానికుల పాల్గొనడం ఎక్కువగా ఉండటంతో కార్యక్రమం మరింత ఉత్సాహభరితంగా మారింది. కాప్రా పరిసరాల్లో ట్రాక్టర్ ర్యాలీ, ఫీల్డ్ ఇంటరాక్షన్తో జనంబాట కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది.


