రీకౌంటింగ్ కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్
శ్రీరామగిరి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ సర్పంచ్ అభ్యర్థి బండ్ల అంజమ్మ జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణమే రీకౌంటింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.కౌంటింగ్ చివరి మూడు వార్డులు మిగిలి ఉండగానే అనూహ్యంగా టీ బ్రేక్ ప్రకటించారని, ఆ సమయంలో రిటర్నింగ్ అధికారి వ్యవహారంపై అనుమానాలు కలిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.అంతేకాకుండా, ఇతర పార్టీకి చెందిన వ్యక్తి అయిన గ్రామపంచాయతీ గుమాస్తా కౌంటింగ్ హాల్లో పలుమార్లు ప్రవేశించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.కౌంటింగ్ దశలో తమకు పందొమ్మిది బండిల్స్ ఉండగా, ప్రత్యర్థి అభ్యర్థికి పద్దెనిమిది బండిల్స్ మాత్రమే ఉన్నాయని, అదే సమయంలో కరెంట్ సరఫరా నిలిపివేయడం జరిగిందని ఆరోపించారు. అనంతరం తమ ఒక బండిల్ మాయమైనట్లు గుర్తించామని తెలిపారు. రిజెక్ట్ అయిన బ్యాలెట్ పేపర్లను చూపించాలని కోరినా అధికారులు చూపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.కౌంటింగ్ పూర్తైన తర్వాత రీకౌంటింగ్ కోరగా, నిర్ణీత సమయం దాటిపోయిందని చెప్పి అధికారులు నిరాకరించారని, బయటకు వెళ్లాలంటే సంతకాలు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. కరెంట్ నిలిచిన సమయంలో కౌంటింగ్ హాల్లో ఏదో అనుమానాస్పద పరిణామం జరుగుతోందని అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా వ్యాఖ్యానించినట్టు తెలిపారు.ప్రతి వార్డుకు సంబంధించిన కౌంటింగ్ వివరాలు, సర్పంచ్ కౌంటింగ్కు సంబంధించిన సమాచారం తమకు అందజేయలేదని పేర్కొంటూ, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి రీకౌంటింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను బండ్ల అంజమ్మ కోరారు.ఈ ఫిర్యాదుపై జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

