అటవీ జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు
మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి:
అటవీ జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కొండ గొర్రె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. బుధవారం విజయపురి కాలనీ పరిధిలోని ములకలపల్లి అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు వన్యప్రాణులను వేటాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ములకలపల్లి అటవీ రేంజ్ అధికారి రవికిరణ్ ములకలపల్లి పరిసరాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ తనిఖీల్లో ములకలపల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆదినారాయణ నివాసం వద్ద కొండ గొర్రెను మాంసం గా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణలో కీలక విషయాలు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ములకలపల్లి అటవీ ప్రాంతంలో తాము ఉచ్చుల సహాయంతో కొండ గొర్రెను వేటాడి చంపినట్లు వారు ఒప్పుకున్నారు. అటవీ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని 15 రోజులు రిమాండ్ కు తరలించినట్లు అటవీ రేంజ్ అధికారి రవికిరణ్ తెలిపారు. అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.


