మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేసే వ్యక్తులు, డీలర్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని కొనిజర్ల మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ హెచ్చరించారు. వానాకాలం సాగు సీజన్ నేపథ్యంలో గురువారం మండలంలోని పలు విత్తన దుకాణాలను వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏవో బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతించిన కంపెనీల విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. అనుమతి లేని విత్తనాల విక్రయం, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు, రైతులకు రసీదులు ఇవ్వకపోవడం వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై విత్తన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, లాట్ నంబర్, కంపెనీ పేరు, ప్యాకెట్ నాణ్యతను పరిశీలించాలని, అనుమతి పొందిన విత్తన దుకాణాల్లోనే కొనుగోళ్లు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని తెలిపారు.ఈ తనిఖీల్లో కొణిజర్ల ఎస్సై సూరజ్తో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


