ఏన్కూరు మండలం రాయమాదారంలో చెట్లు కూలి, విద్యుత్ స్తంభం విరగడంతో అంతరాయం
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి తోడు వీచిన బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలివేగానికి ఆరు ఇళ్ల పైకప్పుల రేకులు ఎగిరిపోగా, పలు చెట్లు నేలకూలాయి. ఒక విద్యుత్ స్తంభం విరిగిపడటంతో గ్రామంలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భూక్యా విజయ, తాటి విజయకుమారి, జబ్బా వెంకటలక్ష్మి, గణపురం అనుష, చపలమాడుగు ప్రశాంతి, భూక్యా వెంకన్నలకు చెందిన ఇళ్ల పైకప్పులు దెబ్బతిని నష్టం వాటిల్లింది. అయితే ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.


