మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
కారేపల్లి మండలం చీమలపాడు గ్రామం లోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనుల పేరుతో మట్టి అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక అనుమతుల ముసుగులో రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున మట్టి తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రాజెక్టు అభివృద్ధి పనుల కోసం అనుమతులు తీసుకున్న కాంట్రాక్టర్లు, ఆ పేరును కవర్గా ఉపయోగించి వేరే ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ట్రాక్టర్లు ద్వారా రాత్రివేళల్లో అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంలో కొందరు అధికారుల నిర్లక్ష్యం లేదా మౌన సమ్మతి ఉందా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు లేకపోవడం మరింత సందేహాలకు దారి తీస్తోంది.స్థానిక ప్రజలు మాట్లాడుతూ, ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న పనులు అభివృద్ధి కోసమా లేక అక్రమ దందాకోసమా అర్థం కావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

