Breaking News

అదును పదును చూసి పత్తి విత్తనాలు వేయాలి రైతులకు ఏవో బాలాజీ సూచన

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

కొనిజర్ల మండలం రైతులు తొందరపడి పొడి దుక్కిలో పత్తి విత్తనాలు వేయవద్దని మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ సూచించారు. అలినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున, భూమి పూర్తిగా తడిసిన తర్వాతే విత్తనాలు వేయాలని అన్నారు.పత్తి విత్తనాల సాగుకు కనీసం 60 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరమని, భూమి చల్లబడక ముందే విత్తనాలు వేస్తే మొలకలు రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఎకరాకు వేల రూపాయలు ఖర్చు చేసి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు వర్షాల కోసం ఎదురుచూడకుండా సాగు ప్రారంభిస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.పత్తి విత్తనాలు జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందకుండా వాతావరణ పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొందరు రైతులు ముందస్తుగా పత్తి సాగు చేసి తరువాత మొక్కజొన్న పంట వేసుకోవాలనే ఉద్దేశంతో పొడి దుక్కిలో విత్తనాలు వేయాలని భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.మల్లుపల్లి గ్రామంలో కొందరు రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది కృష్ణ అర్జునరావు, రైతులు పాల్గొన్నారు.

రైలు కింద పడి యువకుడు మృతి..