
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండలంలోని కనీసం ఒక్క గ్రామంలోనైనా రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ జరిగిందని నిరూపించాలని సవాల్ విసిరారు. రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని, ఎన్నికల హామీల అమలుపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు.ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనే సామెతను ప్రస్తావిస్తూ రైతుల ఆవేదనను విస్మరించే ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలవవని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువుల సరఫరా వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు.ప్రస్తుతం రైతుబంధు నిధులను ఆలస్యంగా, అరకొరగా విడుదల చేస్తున్నారని, యాప్ల పేరుతో యూరియా పంపిణీని క్లిష్టతరం చేసి రైతులను క్యూల్లో నిలబడే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని, మోటార్లు కాలిపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రకటించిన పంటల బోనస్ హామీ ఇప్పటికీ అమలు కాలేదని, దీంతో రైతులు మరోసారి మోసపోయారని విమర్శించారు. మోసపోతే గోస పడతాం అని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలు అదే పరిస్థితిని అనుభవిస్తున్నారని అన్నారు. గత రెండు నెలలుగా వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
