ఆలయ పనులను పరిశీలించిన ఆది శ్రీనివాస్..
మన ప్రగతి న్యూస్/వేములవాడ:
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగు తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఆలయ అభివృద్ధి పనులను అకస్మాత్తుగా తనిఖీ చేశారు, అధికారుల నుంచి పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆలయాభివృద్ధి పై ప్రత్యేక చొరవ తీసుకుని అవసరమైన నిధులను మంజూరు చేశారని తెలిపారు. శృంగేరి జగద్గురు విధిశేఖర భారతి స్వామివారి సూచనల మేరకు ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇటీవల స్వామివారు స్వయంగా వచ్చి ఆలయ పరిశీలన చేసి పలు సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆలయ నిర్మాణ పనుల కారణంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు, స్వామివారి కళ్యాణం, కోడె మొక్కులు, కుంకుమ పూజ, సత్యనారాయణ వ్రతం వంటి అన్ని సేవలు అక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. రాజన్న ఆలయం ఎదుట ఉన్న రావిచెట్టు వద్ద భక్తులకు దర్శన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ప్రజల, భక్తుల మనో భావాలకు అనుగుణంగా ఆలయాభివృద్ధి జరుగుతోందని, అందరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు.రాజన్న భక్తులు వేములవాడ ప్రజలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.


