మన ప్రగతి న్యూస్ /ఖమ్మం జిల్లా
ప్రపంచానికి నిజాలను నిర్భయంగా చేరవేస్తూ, ప్రజాస్వామ్యానికి అండగా నిలిచి, సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యతాయుత పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని మాజీ లోక్సభ పక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.అంతర్జాతీయ జర్నలిస్టు దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.నిజాయితీ, నిష్పక్షపాతంతో వార్తలను ప్రజల ముందుకు తీసుకువచ్చే విలేకరులు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా నిలుస్తూ సమాజానికి అద్దంపడుతున్నారని నామా పేర్కొన్నారు.ప్రజల్లో చైతన్యం పెంచడం, అన్యాయాలు,అక్రమాలు ఎక్కడ జరిగినా వాటిని ధైర్యంగా వెలుగులోకి తేనడం, ప్రభుత్వాలు మరియు ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్యలను చేరవేయడం జర్నలిస్టులు నిర్వహిస్తున్న అత్యంత కీలకమైన బాధ్యతలని ఆయన గుర్తు చేశారు.పలు కష్టాలు,ప్రమాదాలు, ఒత్తిడులు ఎదురైనా నిస్వార్థ సేవాభావంతో పాత్రికేయులు పనిచేయడం అభినందనీయమని ఆయన అన్నారు.సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులకు తగిన గౌరవం, గుర్తింపు ఎల్లప్పుడూ లభించాలని కోరుతూ నామా నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు.

