ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ టి. శ్రీనివాసరెడ్డి
మన ప్రగతి న్యూస్ /ఖమ్మం జిల్లా
జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ టీ.డబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ప్రతినిధుల బృందం శుక్రవారం అడిషనల్ కలెక్టర్ టి. శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేసింది. పాత పద్ధతిలో ఇండ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు రూపొందించి అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్థలాలు ఇవ్వాలనీ వారు కోరారు.జిల్లా కేంద్రమైన ఖమ్మం సహా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు ఆవశ్యకతను వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు నిమ్స్ మినహా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఉద్యోగుల కోసం రూపొందిస్తున్న కొత్త హెల్త్ స్కీమ్ను జర్నలిస్టులకు కూడా వర్తింపజేసి, కాంట్రిబ్యూషన్ను ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు.ఏడాదిన్నరగా పాత అక్రిడిటేషన్లను స్టిక్కర్లతోనే కొనసాగిస్తున్నందున అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా కొత్త అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేసి అర్హత కలిగిన జర్నలిస్టులకు వెంటనే కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని కోరారు. ఇంకా జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ, సమాచార, జీఎడి శాఖల సమన్వయంతో హైపవర్ కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కలం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కార్మికశాఖలో త్రైపాక్షిక కమిటీలను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రతినిధుల బృందం సూచించింది. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు, కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు సాతుపాటి రామయ్య, బోయినపల్లి అంజయ్య, నాయకులు కందికొండ శ్రీనివాస్, చేబ్రోలు నారాయణ, కె.శ్రీనివాస్, ఋషి, షరీఫ్, మందా సత్యానందం పాల్గొన్నారు.


