ఏన్కూరులో వ్యక్తిపై ఎక్సైజ్ ఆక్ట్ కింద కేసు; 200 బాటిల్స్ స్వాధీనం
మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్:
ఏన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆది నరసింహారావు (36) అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి పేరు మోహన్ రావు, కాపు కులానికి చెందిన నరసింహారావు ఏన్కూరు మండలంలో కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తూనే మద్యం అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ఆయనపై ఎక్సైజ్ ఆక్ట్ సెక్షన్ 34(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్వహించిన దాడిలో మొత్తం 200 బాటిల్స్ (37 లీటర్లు), సుమారు రూ.41,500 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఇలాంటి అక్రమ చర్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఏన్కూర్ ఎస్సై సంధ్య హెచ్చరించారు.

