పండగల వేళ మరింత జాగ్రత్త అవసరం – ఏన్కూర్ ఎస్సై సంధ్య
మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
ఏన్కూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సంధ్య మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల వల్ల ప్రజలు భారీగా ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, నకిలీ సందేశాలు, అనుమానాస్పద లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పండగల సమయాల్లో బహుమతులు, క్యాష్బ్యాక్లు, డిస్కౌంట్ ఆఫర్లు పేరుతో పంపిస్తున్న నకిలీ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఏటీఎం సమాచారం, వ్యక్తిగత వివరాలను ఎవరికీ చెప్పరాదని స్పష్టం చేశారు. తెలియని లింకులపై క్లిక్ చేయడం వల్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సైబర్ మోసాలు లేదా ఆన్లైన్ నేరాలకు గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించడంతో పాటు జాతీయ సైబర్ నేరాల సహాయ నంబరు 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని, పోలీస్ శాఖ ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్సై సంధ్య భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

