
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరం, నియోజకవర్గ అభివృద్ధికి నిర్మించిన ప్రజా ఉపయోగకర నిర్మాణాలను చెరిపివేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా, అనంతరం మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, వాటిని ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు.మున్నేరు చెక్డ్యాం, సమీకృత జిల్లా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ఐటీ హబ్, గోళ్లపాడు ఛానల్, ఆధునిక బస్స్టాండ్ వంటి కీలక అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఇటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించిన పువ్వాడ, రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని చెబుతున్న ప్రభుత్వం ఖమ్మం నియోజకవర్గంలోని ఏ గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.ఖమ్మం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా దెబ్బతిందని, చెత్త సకాలంలో తొలగించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, ఖమ్మంలో అవినీతి, అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని, తగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
