
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల కలలు, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసి గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.గిరిజనుల చిరకాల డిమాండ్ల పరిష్కారానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూములకు పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసి గిరిజనుల హక్కులను పరిరక్షించామని పేర్కొన్నారు.మా నాటే మా రాజ్.. మా తండాలో మా రాజ్యం అనే ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ అనేక గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ హక్కు పత్రాలు అందజేశామని తెలిపారు.విద్య,ఉద్యోగ రంగాల్లో గిరిజనుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని అన్నారు. గిరిజన సబ్-ప్లాన్ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు గిరిజన సహకార సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు.అటవీ ఉత్పత్తులకు గిరి బ్రాండ్ను ప్రోత్సహించి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా గిరిజనుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆదివాసీ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం,స్వయంపాలన,ఆర్థికాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి చిరస్మరణీయమని పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
