మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

భారీ వర్షాల కారణంగా వరద నీటి ఉద్ధృతికి ఏన్కూర్ మండలం నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. బ్రిడ్జి సమీపంలో వరద నీటి ప్రవాహానికి రహదారిలో కొంత భాగం కొట్టుకుపోవడంతో పెద్ద గండ్లు ఏర్పడి, ప్రస్తుతం ఆ ప్రాంతం మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది.రహదారి ప్రమాదకరంగా మారడంతో ఫోర్ వీలర్ వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఏన్కూర్ ఎస్ఐ సంధ్య తెలిపారు. ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. వరద నీటి ప్రవాహం ఉన్న సమయంలో వాహనదారులు, భక్తులు రహదారిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు.నాచారం ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులు ప్రస్తుతం ఈ మార్గాన్ని వినియోగించవద్దని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ఎస్ఐ సంధ్య కోరారు. రహదారి పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలకు సురక్షితంగా ప్రకటించే వరకు దెబ్బతిన్న ప్రాంతంలోకి ఫోర్ వీలర్ వాహనాలను అనుమతించబోమని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
