
మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా
సౌదీ అరేబియాలో జరిగిన దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన పలువురు యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తున్న సమయంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో భారతీయులైన పలువురు సజీవదహనమవడం హృదయ విదారకమన్నారు.ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నామ నాగేశ్వరరావు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సౌదీ అధికారులు మరియు భారత రాయబార కార్యాలయం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
