మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
దట్టమైన పొగమంచు కారణంగా వాహన ప్రయాణాలు ప్రమాదకరమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.పొగమంచు పరిస్థితుల్లో దృశ్యమానత తగ్గిపోవడం వలన ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గమనించడం కష్టతరమవుతుందని కమిషనర్ తెలిపారు. స్వల్ప నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని స్పష్టంచేశారు.వాహనాలను అధిక వేగంతో నడపకూడదని, ప్రయాణానికి ముందు వాహనం పరిస్థితిని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగం, హఠాత్తుగా ఓవర్టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు వంటి చర్యలు పూర్తిగా మానుకోవాలని కమిషనర్ సూచించారు.పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయపు వేళల్లో ప్రయాణాలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

