డిసెంబర్ 26 ఖమ్మం సభను జయప్రదం చేయండి నెల్లికంటి సత్యం, బాల నర్సింహ పిలుపు
మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
త్యాగాలు, ప్రజా ఉద్యమాల పునాదులపై నిర్మితమైన కమ్యూనిస్టు పార్టీని శతాబ్ది సంవత్సరంలో మరింత గొప్పగా నిలిపే బాధ్యత ప్రతి కార్యకర్తదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నాయకుడు బాల నర్సింహ పేర్కొన్నారు. గద్వాల నుంచి ప్రారంభమైన సీపీఐ శతాబ్ది ఉత్సవాల బస్ యాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించగా, కొణిజర్ల, వైరా, తల్లాడ మీదుగా ఏన్కూర్ చేరిన బస్ జథాను సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ఘనంగా ఆహ్వానించారు.తరువాత ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన సభలో నేతలు మాట్లాడుతూ…దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీ, పెద్ద ప్రజల హక్కుల సాధనకు, చట్ట సభల్లో ప్రజోద్యమాలకు అనుకూలమైన అనేక చట్టాలను చేయించడంలో ముందుండిందని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన చరిత్ర ఉన్న పార్టీ సీపీఐ తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు.దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న నియంతృత్వ ధోరణులు, ప్రశ్నించే స్వరాలను మౌనపరచే చర్యలు, కార్పొరేట్ వర్గాలకు చేస్తున్న ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత వంటి చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.డిసెంబర్ 26న ఖమ్మం లో జరగనున్న లక్షలాదిమంది పాల్గొనే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని నెల్లికంటి సత్యం, బాల నర్సింహ కార్యకర్తలను కోరారు.ఈ బస్ యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్, జిల్లా సమితి సభ్యులు అమరనేని వీరభద్రం, బానోత్ రాంబాబు, మండల నాయకులు మాడినేని వెంకన్న, నగదర్ రావు, పొన్నం రాంబాబు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


