మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తిమ్మారావుపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తులింగం ప్రజలను కలుసుకుని అవగాహన కల్పించారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన ఆంక్షలు, అమలులో ఉండే శాంతి భద్రత చర్యలపై ఆయన గ్రామస్తులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా సీఐ ముత్తులింగం మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఓటరు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లపై ఒత్తిడి వంటి ఎన్నికల అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామ ప్రజలను కోరారు.గ్రామంలో శాంతి భద్రతను పర్యవేక్షించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎన్.సంధ్య, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

