Breaking News

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు

డాక్టర్ లేక పేషంట్ అవస్థలు

మన ప్రగతి న్యూస్ / గూడూర్

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలంలో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సకాలంలో వైద్యం అందకపోవడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. కొత్తగూడ మండలంలోని ​చక్రాల తండ గ్రామానికి చెందిన మాలోతు శ్రీను (30) అనే యువకుడు ఎంచగూడెంలో తన పని ముగించుకుని, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో కంకర్ రోడ్డుపై బైక్ అదుపుతప్పి శ్రీను కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి.​రోడ్డుపై గాయాలతో పడి ఉన్న శ్రీనును గమనించిన ఓ… బాటసారి వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 పైలట్ గోవర్ధన్, ఈఎంటీ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి స్థానిక కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నైట్ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అత్యవసర సమయంలో వైద్యులు లేకపోవడంతో బాధితుడి పరిస్థితి మరింత విషమించింది. చేసేదేమీ లేక 108 సిబ్బంది ఉన్నతాధికారుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బాధితుడిని నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఇలాంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలు పోకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.