మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
ర్యాగింగ్కు పాల్పడి తమ విలువైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకోవద్దని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి విద్యార్థులను హెచ్చరించారు.పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదేశాల మేరకు యాంటీ ర్యాగింగ్ చట్టంపై అవగాహన కార్యక్రమాల భాగంగా గురువారం మమత మెడికల్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ ర్యాగింగ్ విద్యా వ్యవస్థలో నిషేధితమని, సీనియర్లు జూనియర్లపై ర్యాగింగ్ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి చర్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు.ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్కు గురైతే తక్షణమే ప్రిన్సిపాల్, యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ర్యాగింగ్ సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు కలిసి పని చేస్తే ర్యాగింగ్ సంస్కృతిని నిర్మూలించవచ్చని తెలిపారు.విద్యార్థులు చట్టాన్ని తెలుసుకొని విద్యాభ్యాసంపై దృష్టి సారించి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలని, తల్లిదండ్రులకు గౌరవం తెచ్చేలా ప్రవర్తించాలని సూచించారు. తోటి విద్యార్థుల పట్ల సోదరభావంతో కలిసిమెలిసి చదువుకోవాలని, అత్యుత్సాహంతో జీవితాలను చెడగొట్టుకోవద్దని సలహా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనురాధ, ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


