Breaking News

ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువకుడి ఆత్మహత్య: కాప్రాలో విషాదం

మన ప్రగతి న్యూస్ / జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

కుటుంబంలో నెలకొన్న మనస్పర్థలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ప్రేమించిన యువతి విషయంలో ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా మండల మల్లికార్జున కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మల్లికార్జున కాలనీకి చెందిన పాంపరి అరవింద్ (24), వృత్తిరీత్యా రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అరవింద్ గత ఐదేళ్లుగా తన బంధువైన చింతల శిరీష అనే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, వీరి ప్రేమ వ్యవహారంపై గత కొంతకాలంగా కుటుంబంలో వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం (మార్చి 31) ఉదయం 11 గంటలకు పని నిమిత్తం బయటకు వెళ్లిన అరవింద్, మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన తల్లి పద్మ ఫోన్ చేయగా.. తర్వాత మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అరవింద్ తండ్రి దుర్గయ్య గమనించేసరికి, అరవింద్ తన గదిలో చీరతో ఇనుప రాడ్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి చూడగా, అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. మృతుడి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దేవాలయాన్ని ఢీకొని వ్యక్తి మృతి