మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి
ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకులో రూ. 9.53 లక్షల రుణం పొందిన మోసం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖ నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, గోల్డ్ అప్రైజర్ సహా నలుగురు కలిసి సుమారు 242.25 గ్రాముల నకిలీ బంగారాన్ని అసలైనదిగా చూపించి రుణం పొందినట్లు గుర్తించారు.రుణాలు చెల్లించకపోవడంతో ఖాతాలు ఎన్పీఏలుగా మారగా, వేలం ప్రక్రియలో ఆభరణాలు నకిలీవని బయటపడింది. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడిపై చర్యలు కొనసాగుతున్నాయి.ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ హెచ్చరించారు.

