_ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష..
మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల జిల్లా:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. కూలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పిలుపు నిచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా కేంద్రాలకు తరలించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల ఆన్లైన్ ప్రక్రియ, మిల్లుల కేటాయింపు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డీఆర్డీఓ గీత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, సహకార అధికారి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

