రూ.5.88 కోట్ల ఆస్తుల గుర్తింపు
మన ప్రగతి న్యూస్ / కాప్రా, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
హైదరాబాద్, రెడ్హిల్స్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్) సగ్గం అనంత లక్ష్మీకుమార్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ఓపెన్ ప్లాట్లు, మూడు ఫ్లాట్లు, హైదరాబాద్లో ఓ ఇంటికి సంబంధించిన పత్రాలు లభించాయి. అదేవిధంగా ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మారుతి రిట్జ్ కారు, బజాజ్ బైక్ను కూడా గుర్తించారు.
మొత్తం ఆస్తుల విలువ రూ.5.88 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏసీబీ వెల్లడించింది. మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆస్తులపై పూర్తి స్థాయి ధృవీకరణ కొనసాగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు. లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదుల కోసం ప్రజలు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

